తెలుగు వచనకవితా పితామహుడు 

అన్నమయ్య త్యాగయ్య మొదలగు కవిశేఖరులకు స్పూర్తిదాత 

 భగవద్రామానుజుల తరువాత శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని 

తెలుగునాట ప్రచారం చేసిన వారిలో మొదటి వారు.

శ్రీమాన్ కాంతకృష్ణమాచార్యులు. 

 సంస్కృత భాషలో భగవద్రామానుజులు చేసిన గద్యలను అనుసరిస్తూ చతుర్లక్ష వచనాలు రచించి గానం చేసి ప్రచారం చేసిన ప్రథమ తెలుగు వాగ్గేయకారులు కూడా శ్రీమాన్ కాంతకృష్ణమాచార్యులే అనుకోవచ్చు. వీరిది విలక్షణమైన జానపద పద్ధతి.పాండిత్య ప్రకర్ష తక్కువగాను, జనాకర్షణ ప్రక్రియ ఎక్కువగాను కనిపిస్తుంది. 

ఈయన పామర భాషలో భక్తిని అందించి, వారిలో ధర్మ ప్రవర్తనను పెంపొందించడం అసామాన్యమైనది. సింహాచలంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారికి పరమ భక్తుడు. భగవద్రామానుజులపై విశేషమైన ఆచార్య భావంకల వీరు తమ వచనాలలో మకుటంగా రామానుజులు సింహగిరి నరహరి పేర్లు కూడా కనిపిస్తాయి .

 "యతిరామానుజా ...! అనాథపతీ ..! స్వామీ ...! సింహగిరి నరహరీ ...! నమో నమో దయానిథీ ...!!" 

ఈ విధంగా ప్రతీ వచనానికీ చివర కనిపిస్తోంది...!

 “దేవా! విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము జేయునతడే కులజుండు . శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు. ”

ఇలాంటి పదాలు చూసినప్పుడు సమతామూర్తి భగవద్రామానుజులను సంపూర్ణంగా అనుసరించారనవచ్చు . 

వీరిది విలక్షణమైన జానపద పద్ధతి.పాండిత్య ప్రకర్ష తక్కువగాను, జనాకర్షణ ప్రక్రియ ఎక్కువగాను కనిపిస్తుంది. ఈయన పామర భాషలో భక్తిని అందించి, వారిలో ధర్మ ప్రవర్తనను పెంపొందించడం అసామాన్యమైనది. తరువాత వారైన అన్నమయ్య సంకీర్తనలలో ఇదే స్పూర్తి తో వెంకటేశ్వర నామాన్ని తన కీర్తనలలో చేసారనిపిస్తుంది. 

 వీరు చతుర్లక్ష వచనాలు రచించి గానం చేసినట్లు వీర రచనలవలన తెలుస్తున్నా ప్రస్తుతం 250 దాకా లభ్యమవుతున్నాయి. అన్నమయ్యలాంటి సంకీర్తనాచార్యులకు, పోతన వంటి భాగవతోత్తములకు స్ఫూర్తినిచ్చిన వాగ్గేయకారుడైన కృష్ణమయ్య ఆళ్వారు శ్రేణికి చెందిన తెలుగులో మొదటి పద కవితాచార్యుడు. 

భగవద్రామానుజాచార్యుల్ని అధ్యయనం చేసిన వైష్ణవపండితుడు.

జన్మస్థలం_కాలం

 శ్రీకాంత కృష్ణమాచార్యులు క్రీ.శ. 1295 నుండి క్రి.శ.1323 మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందిన వాడు. ` ప్రతాప చరిత్ర 'సిద్దేశ్వర చరిత్ర'లలో వీరిగురించిన ప్రస్తావన కనిపిస్తుంది. కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన' లో తాను `తారణ' నామ సంవత్సరం, భాద్రపద కృష్ణ చతుర్దశి, మంగళ వారం నాడు జ్యేష్టా నక్షత్రములో సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ, తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ, ఆయన ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు .. 

 కృష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే నరసింహస్వామి బాలుని రూపంలో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి. కృష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజలని దిగ్భ్రాంతుల్ని చేసి భగవంతుని `పదకొండవ అవతారము' గా కొనియాడబడ్డారు. కృష్ణమాచార్యునికి మేనమామ కూతురితో వివాహం జరిగింది. వీరి ఏకైక కుమారుడు తన ఏడవ యేటనే మరణించటంతో, ఆ ఆవేదననధిగమించే ప్రయత్నంలో తన సంకీర్తనలో మరింతగా మునిగిపోయాడు. ఇక్కడే ఈ జగత్తు మాయాజాలం ప్రదర్శిత మౌతుంది. అప్పటికి పరిపూర్ణ యవ్వనంలో నున్న ఆచార్యులవారు స్వామి ఎదుట చిరుతాళాలు మోయిస్తూ, దండెం మీటుతూ, సింహాద్రినాథుని కీర్తిస్తున్న దృశ్యం చూసి, జగన్మోహిని అనే దేవదాసి ఆయనపై మరులుగొన్నదట.ఆమె అసమాన సౌందర్యం, హావభావాల చొరవ, కపటం లేని సాహచర్య కాంక్షతో, ఆచార్యుల వారి హృదయాన్ని ఆకట్టుకున్నదా మోహనాంగి. ఇంతటి మహాభక్తునికీ వికారా లేమిటనిపించవచ్చు. ఈ జగత్తనేది ఉన్నదే, ఇది వింత మాయావి! పోనీ ఆ స్వామి అయినా ఒక అడ్డుపుల్ల వేయవచ్చు గదా! ఇలాంటి సమయాల్లో ఆయన కేవలం సాక్షీభూతుడుగా ఉంటాడుట. వేమన వంటి యోగుల విషయంలో జరిగినట్లుగానే కామిగాని వాడు మోక్షగామి కాడనేదిద కృష్ణమయ్య విషయంలోనూ నిజమే నని తేలింది.

ఈ మలుపు ముక్తిపరంగా వీరిద్దరూ అనుభవించి తీర వలసిన కర్మశేషంగా భావించవచ్చు. ఈ మహాభక్తుడు తన 16వ యేటనే సంకీర్తన సేవకు శ్రీకారం చుట్టాడు. సంకీర్తనకు అతడెంచుకున్న మార్గం వచనం. వచన భక్తి వాజ్ఞ్మయంలో ఇతడే ప్రథమా చార్యుడు. ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో వ్రాయసకారుడిగా ఉన్నప్పుడు కృష్ణమయ్య సింహాద్రి నరసింహుని స్తుతిస్తూ గానం చేస్తే కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 

 కృష్ణమయ్య రచన, సంగీతం, నాట్యం, భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి,.ప్రతిభావంతుడు అన్నింటికీ మించి అభ్యుదయవాది. వచన రచన చేయడం, మాల దాసర్లతో సహపంక్తి భోజనం చేయడం, దేవదాసీ కాంతలతో సహవాసం చేస్తూ, భక్తీ గీతాలు పాడుతూ నాట్యం చేయడం, నాటి మూఢ ఆచారాలను అతిక్రమించడం, చాందస ఆచార్యులను ఎదిరించడం కులమత భేదాలను పాటించకపోవడం వంటివి ఎన్నో అభ్యుదయ భావాలు కృష్ణమయ్య రూపు రేఖలు.వారి కృతుల సారాంశం కూడా ఇదే!. పురాణ, ఇతిహాసిక గాథలు సంస్కృత భాషలో వ్రాయబడిన కావ్యాలుగా స్థిరపడిపోయాయి.సంస్కృతంలో వ్రాసిందే కావ్యంగా ప్రసిద్ధికెక్కింది.ఆ రకంగానే సంస్కృతంలో రచించిన కావ్యాలూ, దైవం కూడా సామాన్య జనానికి దూరం అయిపోతూ వచ్చాయేకాని, సన్నిహితం కాలేకపోయాయి. ఆ కావ్యాలు ప్రజలకి అందుబాటులో ఉండాలనీ, భక్తి భావం సామాన్య జనానికి అందించాలనే సత్సంకల్పంతో, సంసార ఖేదాలని రూపుమాపటానికి కంకణం కట్టుకుని కృష్ణమయ్య వేదాలనీ, ఉపనిషత్ సారాన్ని తెలుగులో తేలికైన మాటలతో వచన రచన చేసి సంగీత, నాట్య శాస్త్రాలని మిళితం చేసి సామాన్య జనానికి అర్ధం అయ్యే రీతిలో గానం చేసి ప్రదర్శించారు. 

 “దేవా! గంగోద్బవమైన మీ దివ్య శ్రీపాద యుగళమ్ము గంటి.......... ఇంద్రాది దిక్పతులు మిమ్ము సేవింపగా గంటి కనకపీతాంబర ప్రభావమ్ము గంటి ”

ప్రతి వచనమూ ... దేవా! అనే సంబోధనతో మొదలై, సింహగిరి వరహరీ! నమో నమో దయానిధీ అన్న మకుటంతో ముగుస్తుంది. వీటిలో వ్యక్తమయ్యే దృఢభావాలు 

"సింహగిరి నృసింహుని మించిన దైవం లేదు శ్రీ వైకుంఠం కంటే మరో ప్రయోజనం లేదు" అని. అందుచేతనే వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు. 

‘వేదంబు తెనుగు గావించి సంసార/ఖేదంబుమాన్చిన కృష్ణమాచార్య’’ అనే ప్రశస్తి పొందాడు. 

 ‘‘దేవాతనువుల మాయ...! తలపోసి తలపోసి చెప్పెదనంటినా కఱకఱల మోహమిది! ఆశల పాషాణంబిది...! అతుకలు జల్లెడయిది....! నాటకములాడెడు బూటకమ్ముల బొమ్మ...! 

అంటూ సాగే వచనాలతో దేశ్య పద్యాలకే ప్రాధాన్యం గమనిస్తాం. నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన మొదటి ఆచార్యులు కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడు! వారి వచనాలలో ఇది ఒకటి...

దేవా...! పెద్దతనంబు చేసి మిము మెప్పించెదనంటినా ... జాంబవంతుడు మీ సన్నిధినే యున్నాడే ..! దేవా..! బుద్ధినినే మెప్పించెదనంటినా ... విభీషణుండు మీ సన్నిధినే యున్నాడే ..! దేవా..! బంటుదనంబు సేసి మిము మెప్పించెదనంటినా ... యంజనాసుతుండు హనుమంతుండు మీ సన్నిధినే యున్నాడే ...! దేవా..! తీర్థంబులాడి మిము మెప్పించెదనంటినా ... గంగా భవాని మీ యంగుష్ఠంబు నందే ఉద్భవించి యున్నదే ...! దేవా...! ప్రదక్షిణములుచేసి మిము మెప్పించెదనంటినా ... సూర్యచంద్రాదులు మీ సన్నిథినే యున్నారే ...! దేవా...! వేదవేద్యుండనై మిము మెప్పించెదనంటినా ... బ్రహ్మ మీ నాభి కమలమం దుద్భవించి యున్నాడే ..! దేవా...! గీతప్రబన్ధములచేత మిము మెప్పించెదనంటినా ... కిన్నర కింపురుష గరుడ గంధర్వ సనక సనందన సనత్కుమార పరమ భాగవతులు.., నారదాదులు మీ సన్నిథినే యున్నారే ..! దేవా...! సత్యంబులచేత మిము మెప్పించెదనంటినా ... సత్యహరిశ్చంద్రుడు మీ సన్నిథినే యున్నాడే ..! దేవా...! ధనదాన్యంబులచేత మిమ్ము మెప్పించెద నంటినా ... శ్రీ మహాలక్ష్మి మీ యుదరమందే యున్నదే ...! దేవా...! శాంత శమదమాది గుణంబులచేత నోర్పు గలిగి యుండెద నంటినా ... భూదేవి మీ సన్నిథినే యున్నదే ...! దేవా...! విందులు పెట్టి మిమ్ము మెప్పించెద నంటినా ... విదుర భరద్వాజ శబరి మొదలైనవారు మీ సన్నిథినే యున్నారే ...! దేవా...! ఏకాదశీ వ్రతాదుల మిమ్ము మెప్పించెద నంటినా ... రుక్మాంగదుండు మీ సన్నిథినే యున్నాడే ...! దేవా...! భక్తివైరాగ్యంబుల జేసి మిమ్ము మెప్పించెద నంటినా ... ప్రహ్లాదుడు మీ సన్నిథినే యున్నాడే ...! దేవా...! వాహనరూపుండనై భరింతు నంటినా ... గరుత్మంతుండు మీ సన్నిథినే యున్నాడే ...! దేవా...! మీ పాద పద్మంబులు నా కన్నుల జూచుకొని మీ ద్వారంబు కాచుక యుండెద నంటినా ... ద్వారపాలకులు మీ సన్నిథినే యున్నారే ...! దేవా...! నేనా మిమ్ము నుతించగలవాడను ...!!?? ఎనుబది నాలుగు లక్షల కోట్ల జీవజంతువులలో నేనొక నరజీవుండనే ... ! దేవా...! మిమ్ము ..., వేయి శిరస్సులు..,రెండువేల జిహ్వలుగల శేషాహి నుతియించి కొనియాడుకొనవలె నంతె గాక ..!!! యతిరామానుజా ...! అనాథపతీ ..! స్వామీ ...! సింహగిరి నరహరీ ...! నమో నమో దయానిథీ ...!!"

కామెంట్‌లు